Harish Rao: కరోనా కేసులు తగ్గాయ్... త్వరలోనే బయటపడతాం: హరీశ్ రావు

Corona cases are decreasing says Harish Rao
  • ప్రజలంతా సహకరిస్తే థర్డ్ వేవ్ నుంచి బయటపడతాం
  • ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది
  • సంక్షేమానికి చిరునామా సీఎం కేసీఆర్
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొత్త కేసుల నమోదు స్వలంగా తగ్గిందని... ప్రజలందరూ సహకరిస్తే త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ నుంచి బయటపడతామని చెప్పారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ. 34 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజారోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వసతులను పెంచే ప్రయత్నం కొనసాగుతోందని చెప్పారు. సత్తుపల్లిలో రూ. 1.25 కోట్లతో డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే క్యాథ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇక కేసీఆర్ కిట్ల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 52 శాతానికి పెరిగాయని తెలిపారు. పెనుబల్లి, కల్లూరు ఆసుపత్రులకు నూతన భవనాలను నిర్మిస్తామని చెప్పారు. సంక్షేమానికి చిరునామా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.
Harish Rao
TRS
KCR

More Telugu News