ఎవరు మాత్రం కెప్టెన్ కావాలనుకోరు.. ఏ బాధ్యతకైనా నేను రెడీ: మహ్మద్ షమీ

  • అన్ని ఫార్మాట్లలోనూ ఆడేందుకు సిద్ధం
  • కోహ్లీ సెంచరీ చేయకపోతే వచ్చిన నష్టమేంటి?
  • వరుసబెట్టి అర్ధశతకాలు బాదుతున్నాడు కదా?
  • అతడు బౌలర్ల కెప్టెన్ అంటూ షమీ ప్రశంసలు
టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పినప్పటి నుంచి తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ఆ బాధ్యతను కె.ఎల్. రాహుల్ కు అప్పగించాలని కొందరు, బుమ్రాకు ఎందుకివ్వొద్దని ఇంకొందరు, పంత్ కూ అవకాశం ఇవ్వాలని మరికొందరు... ఇలా తమ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వారెవరికీ కాదు.. రోహిత్ శర్మకే పగ్గాలప్పగిస్తారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

తాజాగా మహ్మద్ షమీ దానిపై స్పందించాడు. తాను ఏ బాధ్యతకైనా సిద్ధమని, అయితే, అలాంటి ఆలోచనలకు మాత్రం తాను దూరంగా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. ‘‘ప్రస్తుతానికి కెప్టెన్సీపై నేను ఎక్కువగా ఆలోచించదలచుకోలేదు. ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు నేను సిద్ధం. నిజాయతీగా చెప్పాలంటే.. భారత జట్టుకు కెప్టెన్ అవ్వాలని ఎవరు మాత్రం కోరుకోరు? కెప్టెన్ గానే కాదు.. నేను జట్టుకు ఎలాంటి సేవలందించగలనో వాటన్నింటినీ అందించేందుకు సిద్ధం’’ అని తెలిపాడు.

అన్ని ఫార్మాట్లలోనూ ఆడేందుకు తాను రెడీగా ఉన్నానని చెప్పాడు. కోహ్లీపై వస్తున్న విమర్శలనూ అతడు ఖండించాడు. కోహ్లీ శకతం బాదనంత మాత్రాన వచ్చిన నష్టమేంటి? అంటూ మండిపడ్డాడు. ఓ ఆటగాడు ఎంత పెద్దవాడన్నది శతకాలు నిర్ధారించజాలవన్నాడు. కోహ్లీపై విమర్శలకు కారణం అతడు పరుగులు చేయనందుకు కాదని అన్నాడు. వరుసబెట్టి కోహ్లీ అర్ధశతకాలు బాదుతూనే ఉన్నాడు కదా? అని విమర్శకులను షమీ ప్రశ్నించాడు. జట్టుకు ఉపయోగపడినప్పుడు 50 అయినా, 60 అయినా పరుగులేనని చెప్పుకొచ్చాడు. కోహ్లీ బౌలర్ల కెప్టెన్ అని, బౌలర్లకు అతడు అంత స్వేచ్ఛనిచ్చాడని పేర్కొన్నాడు.


More Telugu News

Cricket Mohammed Shami Virat Kohli Team India