పదేపదే ఎన్నికలు జరిగితే అభివృద్ధి కుంటుపడుతుంది: ప్రధాని మోదీ

  • ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితేనే అభివృద్ధి
  • దేశంలో ఓటింగ్ 75 శాతం దాటడం లేదు
  • సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు కానీ ఓటేయడం లేదు
  • ఓటరుకార్డుతో ఆధార్‌ను అనుసంధానిస్తే పారదర్శకత
దేశంలో పదేపదే ఎన్నికలు జరగడం వల్ల ఆ ప్రభావం దేశాభివృద్ధిపై పడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని బీజేపీ పన్నా ప్రముఖ్ (పేజీ కార్యకర్త)లను ఉద్దేశించి ప్రధాని నిన్న నమో యాప్ ద్వారా వర్చువల్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జమిలి ఎన్నికల స్ఫూర్తితో ‘ఒకే దేశం-ఒకే ఓటరు జాబితా’ను రూపొందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానించడం వల్ల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న మన దేశంలో ఓటింగ్ శాతం కూడా 75 శాతం దాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పట్టణ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆసక్తి చూపించడం లేదని ప్రధాని అన్నారు.

ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి జమిలి ఎన్నికలు ఆవశ్యకమని పేర్కొన్న ప్రధాని.. లోక్‌సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలైనా ఒకేసారి నిర్వహించడం వల్ల మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఉద్ఘాటించారు.

Narendra Modi
National Voters' Day
Elections

More Telugu News