ఒమిక్రాన్ కచ్చితంగా ఎక్కువ రోజులపాటు నిలవదు: మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త భ్రమర్ ముఖర్జీ
- వేగంగా వ్యాపిస్తున్నందున వేగంగా వెళ్లిపోతుంది
- జనవరి చివరికి బారత్ లో గరిష్ఠాలకు కేసులు
- ఫిబ్రవరిలో తగ్గుముఖం పడుతుంది
- సహజ నిరోధకత, టీకాలు మేలు చేశాయి
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వచ్చే వారంలోనే కరోనా పాజిటివ్ కేసులు గరిష్ఠాలకు చేరతాయని, దేశవ్యాప్తంగా జనవరి చివరికి తారస్థాయికి చేరి, అనంతరం తగ్గిపోతాయని ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ‘‘దీనికి వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉంది. కార్చిచ్చులా వ్యాపిస్తోంది. అందుకునే ఇది ఎక్కువ రోజుల పాటు కొనసాగబోదు’’ అంటూ తన విశ్లేషణను ముఖర్జీ వివరించారు.
కేసులు ఎక్కువగా వచ్చినా, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. దీనికి దేవుడి అనుగ్రహం, టీకాలు ఇవ్వడం, ప్రజారోగ్య చర్యలు దోహదపడి ఉండొచ్చన్నారు. భారత్ లో సహజ రోగనిరోధకతకు తోడు టీకాలు ఇవ్వడం మేలు చేసిందన్నారు. ఇతర దేశాల్లో కేసులు భారీగా ఉండడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉండడానికి టీకాలు తగినంత తీసుకోకపోవడమే కారణమని చెప్పారు.