APSRTC: బస్సుల్లో కాదు బస్ స్టేషన్లలో... మాస్కుల్లేని వారికి జరిమానాపై ఏపీఎస్ఆర్టీసీ వివరణ

APSRTC clarifies on penalty for no masks
  • రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి
  • సీఎం జగన్ నూతన మార్గదర్శకాలు
  • బస్సుల్లో మాస్కుల్లేకపోతే జరిమానా అంటూ ప్రచారం
  • ఖండించిన ఏపీఎస్ఆర్టీసీ
కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతుండడంతో ఏపీ సీఎం జగన్ నూతన మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మాస్కుల్లేకుండా ఎక్కితే అక్కడికక్కడే జరిమానా విధిస్తారంటూ ప్రచారం జరిగింది. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే ఆ ప్రచారంలో నిజంలేదని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. బస్సుల్లో కాదని, బస్ స్టేషన్లలో మాస్కుల్లేకుండా కనిపిస్తే జరిమానా విధిస్తున్నామని వివరించింది. బస్సుల్లో మాస్కులు లేకుండా ఎక్కిన వారికి జరిమానాలు విధించడంలేదని స్పష్టం చేసింది.

సంక్రాంతి సీజన్ ను దృష్టిలో ఉంచుకుని భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులు తిప్పుతున్నామని, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బస్ స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన చేసింది. బస్ స్టేషన్ ఆవరణలోనూ, పరిసరాల్లోనూ ఇష్టం వచ్చినట్టు వాహనాలు పార్క్ చేసి ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలిగించినా, బస్ స్టేషన్ లోనూ, పరిసరాల్లోనూ మాస్కులు లేకుండా తిరిగినా, బహిరంగ మూత్రవిసర్జన చేసినా చర్యలు ఉంటాయని పేర్కొంది. సెక్యూరిటీ అధికారులు జరిమానా విధిస్తారని తెలిపింది.

More Telugu News

APSRTC
Masks
Penalty
Bus
Bus Station