Trisha: చాలా భయంకరమైన సమయాన్ని అనుభవించా: త్రిష

Actress Trisha tests positive for Corona
కరోనా థర్డ్ వేవ్ ఉద్ధృతి మన దేశంలో క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దాదాపు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మహేశ్ బాబు, మంచు లక్ష్మి, మనోజ్, మీనా, వరలక్ష్మీ శరత్ కుమార్, కరీనా కపూర్, అమృతా అరోరా, స్వర భాస్కర్ తదితరులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో మరో అందాల భామ త్రిష చేరారు.

తనకు కరోనా సోకినట్టు త్రిష సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అన్ని రకాల జాగ్రతలను, కరోనా నిబంధనలను పాటించినప్పటికీ కరోనా బారిన పడ్డానని త్రిష తెలిపారు. న్యూఇయర్ కు ముందు తనకు కరోనా సోకిందని చెప్పారు. కరోనాకు సంబంధించిన అన్ని లక్షణాలు తనకు ఉన్నాయని తెలిపారు. చాలా భయంకరమైన సమయాన్ని అనుభవించానని చెప్పారు.

అయితే, ప్రస్తుతం కోలుకుంటున్నానని, ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందని తెలిపారు. తనను కాపాడిన వ్యాక్సిన్లకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని చెప్పారు. త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకుంటానని అన్నారు. తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని త్రిష అన్నారు.
Trisha
Tollywood
Corona Virus

More Telugu News