కరోనాతో మరణిస్తే రూ.50వేల పరిహారం.. దరఖాస్తులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం

  • తొలి విడతలో 3,870 మందికి పరిహారం మంజూరు
  • దరఖాస్తు చేసుకోవాలంటూ మరోసారి పిలుపు
  • విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటన
కరోనా కారణంగా మరణించిన వారి వారసులకు ప్రభుత్వం పరిహారాన్ని ఇస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని అందించాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరడం తెలిసిందే.

ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు బాధిత కుటుంబాలకు పరిహారాన్నిస్తోంది. గతేడాది నవంబర్ లో దరఖాస్తులకు ఆహ్వానించగా.. మొదటి విడతలో 3,870 దరఖాస్తులను 2021 డిసెంబర్ లో ఆమోదించి, పరిహారాన్ని మంజూరు చేసింది. ఇంకా బాధిత కుటుంబాలు ఎవరైనా పరిహారం అందుకునేందుకు అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.

మీ సేవా కేంద్రం ద్వారా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చనిపోయినట్టు ధ్రువీకరించిన డెత్ సర్టిఫికెట్, కరోనాతో మృతి చెందినట్టు తెలియజేసే (మరణానికి కోవిడ్ కారణమని తెలిపే లేదా కరోనా పాజిటివ్ అని పరీక్షా నివేదిక) పత్రం, ఆధార్ కార్డు వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు జిల్లా స్థాయిలోని కమిటీ నిర్దారించిన అనంతరం పరిహారం మంజూరవుతుంది. మరిన్ని వివరాలకు 040-48560012 నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

Telangana
covid compensation
applications

More Telugu News