Andhra Pradesh: చెన్నైకి నీరు ఇవ్వడానికి ఏపీ సంసిద్ధత... ఇప్పటికే తరలించిన నీటి నుంచి ఇవ్వాలన్న తెలంగాణ!

  • శ్రీశైలం వద్ద ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రతిపాదన
  • అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ
  • ఏపీ కండలేరుకు భారీగా నీటిని తరలించిందని ఆరోపణ
KRMB meet on drinking water for Chennai

నీటి అంశాలకు సంబంధించి దాదాపు ఏ అంశంలోనూ ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరడంలేదు. తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి రాయ్ పురే ఆధ్వర్యంలో చెన్నై తాగునీటి కమిటీ 6వ సమావేశం జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులు కూడా పాల్గొన్నారు.

తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి నీరు అందించేందుకు ఏపీ సర్కారు సంసిద్ధత వ్యక్తం చేయగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. చెన్నైకి నీరు అందించేందుకు వీలుగా శ్రీశైలం వద్ద తమిళనాడు ప్రభుత్వం నూతన ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రతిపాదించింది. ప్రతి సంవత్సరం ఇదొక సమస్యాత్మక అంశం అవుతోందని, శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకం నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఏపీ అభిప్రాయపడింది.

అయితే, తెలంగాణ స్పందిస్తూ, ఇప్పటికే శ్రీశైలం నుంచి ఏపీ భారీగా నీటిని తరలించిందని, ఆ నీటి నుంచి చెన్నైకి నీరు అందించాలని పేర్కొంది. ఏపీ అత్యధికంగా నీటిని కండలేరు జలాశయానికి తరలించిందని, అక్కడి నుంచి నీటిని ఇవ్వాలని సూచించింది. అంతేకాదు, కండలేరు నుంచి చెన్నై వరకు పైప్ లైన్ నిర్మాణంపైనా తెలంగాణ తన అభిప్రాయాలు పంచుకుంది. ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక అందితే పరిశీలించి తమ నిర్ణయం చెబుతామని వెల్లడించింది.

More Telugu News