ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్

  • రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఈ నెల 10న సోదాలు
  • సీఐడీ ఎస్సై ఫిర్యాదుపై మంగళగిరిలో కేసు
  • నిందితులుగా న్యాయవాది, ఏబీఎన్ కెమెరామన్, రిపోర్టర్‌
  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కేసు ట్రాన్స్‌ఫర్ కోసం ప్రతిపాదన
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో సీఐడీ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయ ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదుపై మంగళగిరిలోని సీఐడీ ప్రధాన పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, ఈ కేసులో న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియోగ్రాఫర్ ఎన్.రమేశ్, ఏబీఎన్ రిపోర్టింగ్ ఏజెంట్ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొన్నారు.

రాధాకృష్ణపై నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్‌ను గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని, తదుపరి విచారణ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారికి కేసును ట్రాన్స్‌ఫర్ చేసేందుకు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ నెల 10న ఈ ఘటన జరగ్గా 11న సాయంత్రం ఏడు గంటలకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్‌లో వివరించారు.

ABN-Andhrajyothy
Vemuri Radha Krishna

More Telugu News