Peethala Sujatha: గనులు, ఇసుకను దోచుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు పేదలను దోచుకునేందుకు సిద్ధమయ్యారు: పీతల సుజాత

ఇప్పటి వరకు గనులు, లిక్కర్, భూకబ్జాలు, ఇసుకను దోచుకున్న వైసీపీ నేతలు... ఇప్పుడు పేదలను కూడా దోచుకునేందుకు సిద్ధమయ్యారని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మాట్లాడుతూ పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన పనులను తామే చేసినట్టుగా జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు.

1983 నుంచి పేదలకు ప్రభుత్వాలు ఇళ్లను కట్టించాయని... ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో వేల కోట్లను వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. ఎవరూ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టొద్దని... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వైసీపీ పాలన సాగుతోందని చెప్పారు.
Peethala Sujatha
Telugudesam
YSRCP

More Telugu News