లేడీ టీచర్ విన్నపంపై వెంటనే స్పందించిన సజ్జనార్!
- చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్ కు వెళ్తున్న 200 మంది విద్యార్థులు
- ఉదయం బస్సులు లేక ఇబ్బంది పడుతున్న వైనం
- సమస్యను సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లిన టీచర్ భారతి
వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్ కు 200 మంది విద్యార్థులు వస్తుంటారు. అయితే ఉదయం పూట స్కూల్ కు రావడానికి బస్సులు లేక వీరంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకే బస్సులో వందలాది మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను వీడియో తీసిన టీచర్ భారతి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్విట్టర్ ద్వారా పంపించారు. విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పించి, వారి ఇబ్బందులను తొలగించాలని కోరారు.
ఈ సమస్యపై సజ్జనార్ వెంటనే స్పందించారు. తక్షణమే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో నిన్నటి నుంచి అదనపు బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భారతి కృషి, సజ్జనార్ స్పందించిన తీరుపై విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.