Neeraj Chopra: నా దృష్టంతా క్రీడలపైనే... బయోపిక్ కు ఇంకా సమయం ఉంది: నీరజ్ చోప్రా

Neeraj Chopra opines on biopic
  • టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా
  • బయోపిక్ పై అభిప్రాయాల వెల్లడి
  • తాను ఇంకా పతకాలు సాధించాల్సి ఉందని వివరణ
  • అప్పుడే బయోపిక్ హిట్టవుతుందని వ్యాఖ్యలు
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన భవిష్యత్ ప్రణాళికలపై స్పందించాడు. ప్రస్తుతానికి తన దృష్టంతా క్రీడలపైనే ఉందని అన్నాడు. తన బయోపిక్ కు ఇంకా సమయం ఉందని, ఈలోపు తాను మరిన్ని పతకాలు గెలవాల్సి ఉందని తెలిపాడు.

బయోపిక్ పై ఇప్పటికే పలువురు ఫిలింమేకర్స్ తనను సంప్రదించారని, కానీ క్రీడల్లో తన ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైందని భావిస్తున్నానని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. ఈ దశలో బయోపిక్ రావడం సముచితం కాదని, సినిమా ఫ్లాప్ కావాలని తాను కోరుకోనని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో తాను ఇంకా పతకాలు సాధిస్తే, బయోపిక్ కు కావాల్సిన సరంజామా అందుతుందని, అప్పుడు తప్పకుండా హిట్టవుతుందని అభిప్రాయపడ్డాడు.

క్రీడలకే తన మొదటి ప్రాధాన్యత అని, బాలీవుడ్ అవకాశాల గురించి కూడా ఆలోచించడంలేదని వివరించాడు. భవిష్యత్తులో జావెలిన్ ను 90 మీటర్లు విసరడమే తన లక్ష్యమని నీరజ్ చోప్రా తెలిపాడు. చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో 87.58 మీటర్లు విసిరి బంగారం పతకం సాధించడం తెలిసిందే.

More Telugu News

Neeraj Chopra
Biopic
Medals
Sports
Javelin
India