జగన్ కార్యక్రమాలకు వర్తించని కరోనా రూల్స్ మాకు మాత్రమే వర్తిస్తాయా?: నాదెండ్ల మనోహర్

పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనపై టెన్షన్ కొనసాగుతోంది. పవన్ బహిరంగసభకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.

జనసేన కార్యక్రమాలకు మాత్రమే కరోనా రూల్స్ వర్తిస్తాయా? సీఎం జగన్ పర్యటనలకు వర్తించవా? అని మండిపడ్డారు. జగన్ విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి కోవిడ్ రూల్స్ ని ఎందుకు వర్తింపజేయలేదని అడిగారు. విజయవాడ నగరాన్ని దిగ్బంధించి వేలాది మందితో చెత్త వాహనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తే కరోనా రాదా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ చేతకానితనం వల్ల రాష్ట్రంలోని రోడ్లన్నీ నాశనం అయ్యాయని... వాటిని జనసేన మరమ్మతులు చేస్తోందని నాదెండ్ల చెప్పారు. రోడ్ల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. శ్రమదానంలో పాల్గొనకుండా జనసేన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా శ్రమదానం కార్యక్రమాన్ని చేసి తీరుతామని చెప్పారు.


More Telugu News