హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 30న ఎన్నికలు

తెలంగాణలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న హుజూరాబాద్, ఏపీలో బద్వేలు శాసనసభ స్థానాల ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8ని చివరి తేదీగా నిర్ణయించారు.

ఇక అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు నియోజకవర్గాలతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ, 3 లోక్ సభ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉపఎన్నికలను నిర్వహించనున్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రచారాన్ని హోరెత్తించడానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రచారాలకు కీలక జాతీయ నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక వచ్చింది. ఏపీలోని బద్వేల్ లో వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది.


More Telugu News