డ్రగ్స్ కేసులో నేడు రానాను విచారించనున్న ఈడీ అధికారులు!

టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాదులో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందూలను విచారించిన ఈడీ అధికారులు నేడు దగ్గుబాటి రానాను ప్రశ్నించనున్నారు. రానా మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈడీ అధికారులు రానాను డ్రగ్స్ కు సంబంధించి పలు కోణాల్లో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

కాగా, టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్ ను నిన్న ఈడీ అధికారులు విచారించారు. నిన్న నందూను విచారిస్తున్న సమయంలోనే కెల్విన్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చాడు.

అంతకుముందు, కెల్విన్ నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆశ్చర్యకర పరిణామం ఎదురైంది. ఈడీ విచారణకు రావాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను స్వీకరించేందుకు కెల్విన్ ససేమిరా అనడంతో అతడి భార్య జోక్యం చేసుకుంది. కెల్విన్ కు నచ్చచెప్పి నోటీసులపై సంతకం చేయాలని సూచించింది. అనంతరం పోలీసులు కెల్విన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ల్యాప్ టాప్ ను, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Rana Daggubati
Drugs Case
Rana
ED
Tollywood

More Telugu News