Yogi Adityanath: యోగి సర్కారుపై వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం.. యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై రాజద్రోహం కేసు

Sedition Case Against Ex Governor Over Remarks Against Yogi Government
  • యోగి ప్రభుత్వాన్ని రక్తం తాగే పిశాచిగా అభివర్ణించిన ఖురేషి 
  • మాజీ ఎమ్మెల్యే ఆజాం ఖాన్‌ను కలిసిన సందర్భంగా వ్యాఖ్యలు
  • రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా ఉన్నాయని ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రక్తం తాగే పిశాచిగా అభివర్ణించిన యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి (81)పై రాజద్రోహం కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజాం ఖాన్, ఆయన భార్య తంజీమ్ ఫాతిమాలను వారి ఇంట్లో కలుసుకున్న అజీజ్ ఖురేషి అనంతరం మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వాన్ని రక్తం తాగే పిశాచిగా అభివర్ణించారు.

ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన యూపీ బీజేపీ నేత ఆకాశ్ కుమార్ సక్సేనా రాంపూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అజీజ్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని, మత కల్లోలాలను ప్రేరేపించేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అజీజ్‌పై పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్‌ నేత అయిన అజీజ్ 2014-15 మధ్య మిజోరం గవర్నర్‌గా పనిచేశారు. అదే సమయంలో యూపీ గవర్నర్‌గానూ కొంతకాలం సేవలందించారు.
Yogi Adityanath
Aziz Quresh
Sedition Case

More Telugu News