Tirumala: తిరుమల శ్రీవారికీ తప్పని నకిలీ బాధ.. భక్తులకు ‘ఫేక్​ దర్శన టికెట్ల’ బెడద!

  • పాత కల్యాణోత్సవ టికెట్లను మార్చి ఇస్తున్న దళారులు
  • ఇంటి దొంగలే సహకరిస్తున్నారంటున్న అధికారులు
  • బార్ కోడింగ్ స్కాన్ లో గుర్తించలేకపోవడమేంటని అనుమానాలు
  • జిరాక్స్ సెంటర్లతో సంబంధాలు ఉండి ఉంటాయని అంచనా
Devotees In Tirumala Gets Tricked By Fake Tickets

తిరుమల ఏడుకొండలవాడికీ నకిలీ బాధ తప్పట్లేదు. కొందరు కేటుగాళ్లు భక్తులకు నకిలీ దర్శన టికెట్లను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఇంటి దొంగల హస్తమున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరెవరిపై అయితే అనుమానాలున్నాయో వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. కొన్ని టికెట్లనే ఆన్ లైన్ లో పెడుతున్నారు. స్లాట్ ఇలా ఓపెన్ అయిపోతే చాలు.. టికెట్లు అలా అయిపోతున్నాయి. దీంతో చాలా మందికి నిరాశ తప్పట్లేదు. ఈ క్రమంలోనే కొందరు దళారులు ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పాత కల్యాణోత్సవ టికెట్లను డౌన్ లోడ్ చేసి వాటిని మార్చి, భక్తుల పేర్లను చేర్చి నకిలీలుగా మారుస్తున్నారు. వాటినే భక్తులకు అంటగడుతున్నారు. అందులో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.

అయితే, వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు ఉద్యోగులే సహకరిస్తున్నారని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ తంతు నడుస్తున్నా.. బార్ కోడింగ్ స్కాన్ చేసినప్పుడు అవి నకిలీవన్న సంగతిని సిబ్బంది ఎందుకు గుర్తించట్లేదన్న అనుమానాలను వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులకు తిరుమల, తిరుపతిలోని జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులతో సంబంధాలు ఉండి ఉంటాయని అంటున్నారు. దానిపైనే ఇప్పుడు అధికారులు ఫోకస్ చేశారు.

More Telugu News