అమరరాజా ఫ్యాక్టరీది రాజకీయ సమస్య కాదు, వాతావ‌ర‌ణ కాలుష్య సమస్య: ఎమ్మెల్యే రోజా

అమరరాజా ఫ్యాక్టరీది రాజకీయ సమస్య కాదని, వాతావ‌ర‌ణ కాలుష్య సమస్య అని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. అమరరాజాతోపాటు 54 ఫ్యాక్టరీలకు పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చిందని, గతంలో ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై గగ్గోలు పెట్టిన బాబు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న అమరరాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడటం లేదని  రోజా ప్ర‌శ్నించారు.

‘అమరరాజా’ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంపై చంద్రబాబు త‌రుచూ విమర్శలు చేస్తున్నారని, అది పధ్ధతి కాదని ఆమె చెప్పారు. రాష్ట్రంలో 54 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని, గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమయ్యాయని ఆమె తెలిపారు. అమరరాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, హైకోర్టు ఆదేశాలను శిరసా వహించి కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణలోనూ ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో తెలుసుకుని మాట్లాడాలని ఆమె అన్నారు. పరిశ్రమలకు త‌మ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అమరరాజా కంపెనీని జగన్ ప్రభుత్వం మూసివేయాలని చెప్పలేదని అన్నారు. తప్పులను సరిదిద్దుకుని నియమ నిబంధనలతో పరిశ్రమలు నడిపించాలని అమరరాజాను ప్ర‌భుత్వం కోరింద‌ని తెలిపారు.


More Telugu News