USA: ప్రాథమిక స్వేచ్ఛను నమ్ముతాం: అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్​

Antony Blinken Arrives in India Says Believe In Fundamental Freedom
  • పౌర సంఘాల ప్రతినిధులతో భేటీ
  • నేటి సాయంత్రం ప్రధానితో సమావేశం
  • ఆఫ్ఘన్, కరోనా, రక్షణ రంగాలపై చర్చ
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ రెండ్రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ లో చేయి దాటిపోతున్న భద్రతా పరిస్థితులు, ఇండో–పసిఫిక్ సంబంధాల బలోపేతం, కరోనా మహమ్మారి కట్టడి వంటి విషయాలపై ఆయన చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టాక.. ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ కు రావడం ఇదే తొలిసారి.

ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో బ్లింకెన్ సమావేశం కానున్నారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోనూ భేటీ అవుతారు. భారత్, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలకు ప్రాథమిక స్వేచ్ఛ, చట్టాలే పటిష్ఠ పునాదులని బ్లింకెన్ అన్నారు. ‘‘మానవ గౌరవం, సమాన అవకాశాలు, చట్టం, ప్రాథమిక స్వేచ్ఛ వంటి వాటిని భారత్, అమెరికా ప్రజలు ఎప్పుడూ విశ్వసిస్తారు. మత స్వేచ్ఛనూ నమ్ముతారు’’ అని అన్నారు.  


అంతకుముందు దేశంలోని పౌర సంఘాల ప్రతినిధులతో బ్లింకెన్ సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ లో దిగజారిపోతున్న పరిస్థితులు, తాలిబన్ ఆగడాలపై చర్చించనున్నారు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాల నిరంతర సరఫరాపై మాట్లాడనున్నారు. రక్షణ రంగంలో భాగస్వామ్యం, సహకారాన్ని మరింతగా బలోపేతం చేసే విషయమూ చర్చకు రానుంది.
USA
Antony Blinken
Fundamental Freedom

More Telugu News