హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 9 మంది పర్యాటకుల మృతి.. భయం గొల్పుతున్న వీడియో!

  • కొండపై నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన బండరాళ్లు 
  • ధ్వంసమైన బ్రిడ్జి, పర్యాటకుల వసతి గదులు
  • రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర విచారం
  • పరిహారం ప్రకటన
కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి చెందిన దారుణ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సాంగ్లా లోయలో జరిగింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 1.25 గంటలకు సాంగ్లా-చిట్కుల్ మార్గంలోని బట్సేరి వద్ద కొండపై నుంచి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చిన బండరాళ్లు లోయలోకి జారిపడ్డాయి. ఓ బండరాయి బ్రిడ్జిపై పడడంతో అది అమాంతం కుప్పకూలింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరణించిన వారిలో రాజస్థాన్‌కు చెందిన నలుగురు, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర వాసి ఒకరు, ఢిల్లీకి చెందిన ఇద్దరు వున్నారు. బండరాళ్లు పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విశ్రాంతి గదులు కూడా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.


More Telugu News

Himachal Pradesh Land Slides Tourists