కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: పవన్ కల్యాణ్

  • అనారోగ్యంతో బాధపడుతున్న వీహెచ్
  • హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • స్వయంగా వెళ్లలేకపోయానన్న పవన్
  • కాంగ్రెస్ నేతల్లో వీహెచ్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, వీహెచ్ త్వరగా కోలుకోవాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. వీలైనంత త్వరగా ఆయన మళ్లీ ప్రజాసేవకు అంకింత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇష్టపడే నేతల్లో వీహెచ్ ఒకరని పవన్ తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటం సాగిండచంలోనూ, ప్రజా వాణిని బలంగా వినిపించడంలోనూ ఆయన శైలి ప్రత్యేకం అని పేర్కొన్నారు. ఈ ప్రత్యేకత వల్లే ఆయనకు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఉన్నతస్థానం దక్కిందని అభిప్రాయపడ్డారు. వీహెచ్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికెళ్లి పోరాడతారని కితాబిచ్చారు. ఆయన చొరవ ఇతర నేతలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

"వీహెచ్ అనారోగ్యంపాలై, ఆసుపత్రిలో చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి గురించి అపోలో వర్గాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నాను. అయితే అప్పుడు కొవిడ్ పరిస్థితులు బలంగా ఉన్నాయి. దానికి తోడు ఆయన ఐసీయూలో ఉన్నారు.  డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రికి స్వయంగా వెళ్లి పరామర్శించలేకపోయాను. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో మళ్లీ రావాలని, రాజకీయ సేవ చేయాలని నా తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నా" అని తన ప్రకటనలో తెలిపారు.

Pawan Kalyan
V Hanumantha Rao
Illness
Recovery
Congress
Telangana
Janasena

More Telugu News