Andhra Pradesh: గుంటూరులో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సమావేశం... హాజరైన అగ్రనేతలు

Leaders held meeting to continue fight for special status
  • ఏడేళ్లుగా పోరాటం సాగుతోందన్న చలసాని
  • కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణ
  • బీజేపీ మోసం చేసిందన్న సీపీఎం మధు
  • జగన్ కేంద్రంతో కుమ్మక్కయ్యారన్న నక్కా ఆనంద్ బాబు
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేడు గుంటూరులో సమావేశమైంది. ఈ కార్యక్రమానికి చలసాని శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు, టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఏడేళ్లుగా పోరాటం సాగుతోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పందిస్తూ, విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేకహోదా అంశంలో వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి లొంగిపోయినట్టుగా భావించాల్సి వస్తోందని విమర్శించారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరిలో స్పష్టత కనిపించడంలేదని పేర్కొన్నారు.

టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు స్పందిస్తూ... సీఎం జగన్ కేంద్రంతో కుమ్మక్కై ప్రత్యేకహోదా అంశాన్ని గాలికి వదిలేశారని ఆరోపణలు చేశారు. కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్ ఏంచేశారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం హోదా గురించి అడిగేందుకు జంకుతోందని నక్కా ఆనంద్ బాబు అన్నారు. ప్రజా సంఘాలు ఇప్పుడు హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
Andhra Pradesh
AP Special Status
Meeting
Guntur

More Telugu News