కరోనాతో మరో పెద్ద సమస్య.. పేగుల్లో గ్యాంగ్రీన్
- ముంబైలో బయటపడిన కేసులు
- 12 కేసులను వెల్లడించిన వైద్యులు
- నగరంలోని ప్రతి ఆసుపత్రిలోనూ కేసులంటున్న నిపుణులు
- గుజరాత్ లోని రాజ్ కోట్ లో వంద మందికి సమస్య
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు ఈ కేసులు ఎక్కువైపోయాయి. అయితే, ఇప్పటిదాకా కేవలం ఓ డజను కేసుల గురించే వైద్యులు బయటకు వెల్లడించారు. ఎవరైనా కరోనాతో కోలుకున్నాక భరించలేని నొప్పులు, కడుపునొప్పి వంటివి వస్తే అస్సలు ఆలస్యం చేయొద్దని సూచిస్తున్నారు.
ఈ మధ్యే హోలీ స్పిరిట్ ఆసుపత్రిలో పనిచేసే సునీల్ గవాలీ అనే వ్యక్తికి ఇదే సమస్య వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అప్పటికే అతడిలో పేగులోని గడ్డ కాస్తా గ్యాంగ్రీన్ గా మారిపోయిందని, వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. అతడికి సీటీ స్కాన్ చేయగా.. పేగులకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టినట్టు నిర్ధారించారు.
ఇప్పటిదాకా ఆ ఆసుపత్రిలో ఇలాంటి కేసులు 8 నుంచి 9 దాకా వచ్చాయని చెబుతున్నారు. ఫోర్టిస్ అండ్ జూపిటర్ ఆసుపత్రికీ ఐదు కేసులొచ్చాయి. అక్కడ ఒకరు ఆ సమస్యతో చనిపోయారు. మరో ఇద్దరికి శస్త్రచికిత్సలు చేసి గ్యాంగ్రీన్ ను తొలగించారు. కాగా, గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఇలాంటి కేసులు వంద దాకా వచ్చినట్టు తెలుస్తోంది.