ట్విట్టర్​ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi HC issues notice to Twitter over non compliance of new IT rules
  • ఐ–టీ నిబంధనలను పాటించట్లేదని పిటిషన్
  • గ్రీవెన్స్ ఆఫీసర్ నే పెట్టలేదన్న పిటిషనర్
  • అమెరికా వ్యక్తిని నియమించారంటూ ఆరోపణ
నూతన సమాచార సాంకేతిక (ఐ–టీ) నిబంధనల విషయంలో ట్విట్టర్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐ–టీ నిబంధనలను ట్విట్టర్ పాటించట్లేదని, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ కు సంబంధించిన వివరాలేవీ సోషల్ మీడియా సైట్ లో కనిపించట్లేదని పేర్కొంటూ అమిత్ ఆచార్య అనే అడ్వొకేట్ పిటిషన్ వేశారు.

మే 25 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నియమాలను ట్విట్టర్ పట్టించుకోవట్లేదని అందులో పేర్కొన్నారు. అమెరికాకు చెందిన వ్యక్తిని గ్రీవెన్స్ ఆఫీసర్ గా నియమించిందని, కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021లోని రూల్ 4కు అది విరుద్ధమని ఆరోపించారు.

అయితే, మే 28నే తాము గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించామని ట్విట్టర్ తరఫు ప్రతినిధి కోర్టుకు వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్ రేఖ పల్లి.. ట్విట్టర్ కు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేశారు.
Go Back to Shorts
Twitter
I-T Rules
New Delhi
High Court

More Telugu News