నాపై జగన్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావా?: చంద్రబాబు

Chandrababu fires on Jagan
  • నన్ను కాల్చాలని జగన్ గతంలో అన్నారు
  • రఘురాజును హింసించారనే విషయం సుప్రీంకోర్టులో తేలింది
  • ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను కూడా బెదిరించారు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేందుకు కాదు రాజ్యాంగం ఉన్నది అని అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి... అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని హితవు పలికారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడారని... తనను కాల్చి చంపాలని, చొక్కా పట్టుకోవాలని అన్నారని... ఈ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావా? అని ప్రశ్నించారు. రఘురాజును హింసించారనే విషయం సుప్రీంకోర్టులో తేలిందని చెప్పారు.

చివరకు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను కూడా ప్రభుత్వం బెదిరించిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాల్సిన ప్రభుత్వం... తక్షణమే మందును నిలిపివేయాలని ఆదేశించడం బాధాకరమని అన్నారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యే కూడా మందు పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లారని... ఆయన పిలుపుతో వేలాది మంది కృష్ణపట్నంలో గుమికూడారని చెప్పారు.

ఏపీలో కరోనా ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోందని... ఆక్సిజన్ కూడా దొరక్క ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడిపై దృష్టి సారించాల్సిన ముఖ్యమంత్రి... కక్ష సాధింపులకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై ఎదురు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయని... ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News