CBI: డీఎల్ఎఫ్ లంచం కేసులో లాలూకు సీబీఐ క్లీన్​ చిట్​!

CBI Gives Clean Chit To Lalu Yadav In DLF Bribery Case
  • లాలూ రైల్వే మంత్రిగా ఉండగా ఘటన  
  • బాంద్రా, న్యూఢిల్లీ స్టేషన్ల మధ్య ఆధునికీకరణ పనుల విషయంలో లంచం ఆరోపణలు   
  • రెండేళ్ల విచారణలో వాస్తవం లేదని తేల్చిన సీబీఐ  
డీఎల్ఎఫ్ లంచం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాణా కుంభకోణం కేసులో ఇప్పటికే మూడేళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఆయన గత ఏప్రిల్ లోనే జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు డీఎల్ఎఫ్ కేసులో కూడా ఉపశమనం లభించింది.

ముంబైలోని బాంద్రా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ ప్రాజెక్టులకు సంబంధించి డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి లాలూ లంచం తీసుకున్నాడన్న ఆరోపణలున్నాయి. సీబీఐ ఆర్థిక నేరాల విభాగం 2018 జనవరిలో ఈ కేసు విచారణను ప్రారంభించింది. రెండేళ్ల విచారణలో లాలూపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీబీఐ అధికారులు తేల్చారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

అయితే, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పలు అక్రమాలు జరిగాయని పేర్కొంటూ సీబీఐ దర్యాప్తు బృందం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని చెప్పాయి. ముందటి తేదీలు వేసిన చెక్కులు, బోగస్ లావాదేవీలు, లాలూ కుటుంబ సభ్యులకు అతి తక్కువ ధరలకే ఆస్తుల బదలాయింపు వంటి వాటిలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఆదాయపన్ను శాఖ కూడా దీనిపై ప్రత్యేక దర్యాప్తును చేపడుతోంది.
CBI
DLF
Lalu Prasad Yadav

More Telugu News