బ్లాక్ ఫంగ‌స్ కేసుల తీవ్రత దృష్ట్యా తెలంగాణ స‌ర్కారు అప్ర‌మ‌త్తం.. కీల‌క నిర్ణ‌యాలు

ts govt decisions for black fungus
  • హైద‌రాబాద్‌ కోఠి ఈఎన్టీ ఆసుప‌త్రిని నోడల్ కేంద్రంగా ప్రకట‌న‌
  • బ్లాక్ ఫంగస్ వ‌స్తే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స
  • షుగర్‌ స్థాయిని అదుపు చేయాలి
  • సరోజినిదేవి ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలి
తెలంగాణ‌లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. బ్లాక్ ఫంగ‌స్‌ బాధితులకు సాయం, చికిత్స కోసం హైద‌రాబాద్‌ కోఠి ఈఎన్టీ ఆసుప‌త్రిని నోడల్ కేంద్రంగా ప్రకటించింది. క‌రోనా సమయంలోనే బ్లాక్ ఫంగస్ సోకితే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తారు.

అలాగే, కొవిడ్ చికిత్స తీసుకుంటోన్న కరోనా బాధితుల‌కు బ్లాక్ ఫంగ‌స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ఆసుప‌త్రుల‌తో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర స‌ర్కారు ప‌లు సూచ‌న‌లు చేసింది.  కొవిడ్‌ రోగులకు చికిత్సను అందించే సమయంలో షుగర్‌ స్థాయిని అదుపు చేయాలని తెలిపింది.

బాధితుల‌కు ఈఎన్‌టీ సమస్యలు త‌లెత్తే అవ‌కాశం ఉండ‌డంతో వారికి కంటి వైద్యుడి అవసరం ఉంటే సరోజినిదేవి ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని చెప్పింది. ఈ క్ర‌మంలో గాంధీ ఆసుపత్రి, సరోజినిదేవి ఆసుప‌త్రి, ఈఎన్‌టీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పరస్పరం సమన్వయంతో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పింది.  

కాగా, క‌రోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ వాడటంతో పాటు మధుమేహం ఉన్నవారిలో బ్లాక్ ఫంగ‌స్ ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టికే పలువురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు.
Go Back to Shorts
Black Fungus
Corona Virus
COVID19
Telangana

More Telugu News