Saina Nehwal: సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌కు సన్నగిల్లిన ఒలింపిక్స్‌ అవకాశాలు!

Saina srikanth may not participate in Olympics
  • వీరిరువురి ఒలింపిక్స్‌ అర్హతకు మిగిలినవి రెండు టోర్నీలు
  • వాటిలో మలేసియా ఓపెన్‌ వాయిదా
  • మరొకటి సింగపూర్‌ ఓపెన్‌ ఆడే అవకాశాలూ తక్కువే
  • భారత విమానాలను నిషేధించిన సింగపూర్‌
కౌలాలంపూర్‌లో జరగాల్సిన మలేసియా ఓపెన్‌ టోర్నీ వాయిదా పడింది. దీంతో ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కలలుగన్న భారత బాడ్మింటన్ ఆటగాళ్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా ఓపెన్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో వారు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు మలేసియా ఓపెన్‌, సింగపూర్‌ ఓపెన్‌ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి తాజాగా వాయిదా పడింది. దీంతో వారిరువురు ఒలింపిక్స్‌ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి.

ఇక ఒకవేళ మలేసియా ఓపెన్‌ని రీషెడ్యూల్‌ చేసినా ఒలింపిక్స్‌కు అర్హత కింద పరిగణించే టోర్నీల జాబితాలోకి దీన్ని తీసుకునే అవకాశం లేదని ప్రపంచ బాడ్మింటన్ ఫెడరేషన్‌ తెలిపింది. ఇక మిగిలిన ఒకే ఒక్క టోర్నీ సింగపూర్‌ ఓపెన్‌. దాంట్లోనూ వీరు ఆడే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. భారత్‌ నుంచి వచ్చే విమానాలపై సింగపూర్‌ నిషేధం విధించింది. ఒకవేళ అక్కడికి చేరుకోవాలంటే భారత్‌ నుంచి మరో దేశానికి వెళ్లి 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అక్కడి నుంచి సింగపూర్‌ చేరుకోవాలి. అక్కడ మరో 21 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అంటే మొత్తం 35 రోజుల సమయం కావాలి. కానీ, టోర్నీ జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుండడం గమనార్హం.

More Telugu News

Saina Nehwal
Kidambi Srikanth
Olympics