సువేందు అధికారి పీఎ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్తో తన కొడుకును చంపేశారన్న తల్లి
- చంద్రనాథ్ ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగులు
- ఛాతీ, పొట్ట, తలలోకి దూసుకెళ్లిన 10 బుల్లెట్లు
- కన్నీరుమన్నీరవుతున్న చంద్రనాథ్ కన్నతల్లి
- మమత ఓటమిని త్టుకోలేక తన కొడుకును చంపేశారని ఆరోపణ
- హంతకులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని విన్నపం
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో బీజేపీ శ్రేణులు ఉన్న సమయంలో... ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురవడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన చంద్రనాథ్ రథ్, నిన్న రాత్రి ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యగ్రామ్ సమీపంలో తన స్కోర్పియో వాహనంలో వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఒక సాంట్రో కారు ఆయన వాహనాన్ని అడ్డుకోగా, అదే సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు అతి సమీపం నుండి కాల్పులు జరిపారు. సుమారు 10 బుల్లెట్లు ఆయన ఛాతీ, పొట్ట, తలలోకి దూసుకుపోవడంతో, ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, తన కొడుకును కోల్పోయిన చంద్రనాథ్ తల్లి హసిరాణి రథ్ విలేకరుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. మమతా బెనర్జీ ఓటమిని తట్టుకోలేక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులే పక్కా ప్లాన్తో తన కొడుకును హింసించి చంపారని ఆమె ఆరోపించారు. "మే 4 తర్వాత మిమ్మల్ని ఢిల్లీ నాయకులు కూడా కాపాడలేరు" అంటూ టీఎంసీ నేతలు ముందు నుంచే బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు పడాలని, అప్పుడే వారు చేసిన తప్పుకు రోజూ కుమిలిపోతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హత్య తర్వాత బెంగాల్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు 433 మందిని అరెస్టు చేయగా, 1,100 మందికి పైగా వ్యక్తులను నిర్బంధంలో ఉంచారు. ఈ ఘటనపై 200కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ ఘటనపై సువేందు అధికారి స్పందిస్తూ.. ఇది పక్కాగా ప్లాన్ చేసి చేసిన రాజకీయ హత్య అని, తనకు ఇది వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. అయితే బీజేపీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. మరోవైపు టీఎంసీ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని డిమాండ్ చేసింది.