మోదీపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్రమోదీపై స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణాలకు మోదీనే కారణమని, ఆయన పెట్టే ఒత్తిడి తట్టుకోలేకే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్షాలు కత్తులు దూసుకుంటున్న వేళ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఉదయనిధి వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉదయనిధి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మోదీకి తన తల్లి ఎంతగానో విలువనిచ్చే వారని అన్నారు. ప్రధానితోపాటు పార్టీ తమకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలు తమను బాధించాయని, ఎన్నికల ప్రచారం కోసం దయచేసి తన తల్లి పేరును వాడొద్దని కోరారు.

జైట్లీ కుమార్తె సోనాలీ జైట్లీ కూడా ఉదయనిధి వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఉదయనిధి ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం తమకు తెలుసని, అయితే, తన తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీకి, తన తండ్రికి మధ్య రాజకీయాలకు అతీతమైన స్నేహం ఉందని, దానిని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని ఆశిస్తున్నానంటూ సోనాలీ ట్వీట్ చేశారు.


More Telugu News