Neelam Sahni: రేపు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నీ

  • కలెక్టర్లు, ఎస్పీలతో ముగిసిన సమావేశం
  • పరిషత్ ఎన్నికల నిర్వహణపై చర్చ
  • కోర్టులో తీర్పు పెండింగ్ లో ఉన్న అంశం ప్రస్తావన
  • కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికలపై ప్రకటన!
SEC Neelam Sahni will meet political parties tomorrow

ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో రేపు రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల అంశం చర్చించనున్నారు. పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఈ మధ్యాహ్నం నీలం సాహ్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు నీలం సాహ్నీ స్పష్టం చేశారు. ఈ భేటీ సందర్భంగా జిల్లాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా, పరిషత్ ఎన్నికలపై కోర్టులో ఓ కేసు పెండింగ్ లో ఉన్న అంశాన్ని కూడా ఆమె ఉన్నతాధికారులతో చర్చించారు. కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. పరిషత్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను ఇప్పటికే విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ తీర్పు ఏప్రిల్ 3న వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పు వచ్చాకే పరిషత్ ఎన్నికల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

More Telugu News