తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థుల ఆస్తుల వివరాలు!

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికలో వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరపున పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరపున చింతా మోహన్, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేస్తున్నారు.

వీరిలో రత్నప్రభ అందరి కంటే సంపన్నమైన వ్యక్తిగా నిలిచారు. గతంలో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆమె... తనకు రూ. 25 కోట్ల విలువైన ఆస్తి (భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి) ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ. 3.5 కోట్లుగా పేర్కొన్నారు. రూ. 52 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ తనకు ఆస్తులు లేవని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తనకు రూ. 10 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తనకు రూ. 40 లక్షల ఆస్తి ఉన్నట్టు తెలిపారు. ఈ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు.


More Telugu News