బద్వేల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత వెంకట సుబ్బయ్య హఠాన్మరణం!

కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వెంకట సుబ్బయ్య ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఆయన్ను కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు.

1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య, ఆర్థోపెడిక్ సర్జన్ గా ప్రజలకు సుపరిచితులు. 2016లో బద్వేల్ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి, ఆపై 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ పై 44 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సుబ్బయ్య మృతి పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు.



More Telugu News