నరేంద్ర మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా!

  • ఢాకా ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని 
  • సైనిక వందనాన్ని స్వీకరించిన మోదీ
  • సాయంత్రం బంగ్లా జాతీయ దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. తన మంత్రివర్గ సహచరులను, సైనిక అధికారులను ఆమె మోదీకి పరిచయం చేశారు. ఆపై బంగ్లా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. కరోనా తర్వాత ప్రధాని మోదీ తొలి పర్యటన ఇదే కాగా, నేడు మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో ఢాకాలోని అమరవీరుల స్మారకాన్ని మోదీ సందర్శించనున్నారు.

ఆపై మధ్యాహ్నం 12.35 గంటలకు బంగ్లా రాజకీయ నేతలతో సంభాషించనున్న ఆయన, ఆపై 12.45 గంటలకు స్థానికులతో సమావేశం కానున్నారు. 12.55 గంటలకు ప్రతిపక్ష నేతలతో భేటీ అయ్యే మోదీ, భోజన విరామం తరువాత మధ్యాహ్నం 3.45 గంటలకు ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అవుతారు.

ఇక సాయంత్రం 4 గంటల తరువాత జరిగే బంగ్లా జాతీయ దినోత్సవంలో పాల్గొని తన సందేశాన్ని ఇస్తారు. సాయంత్రం 6.15 గంటలకు షేక్ హసీనా ఏర్పాటు చేసిన విందులో పాల్గొననున్న మోదీ, రాత్రి 8 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రదర్శనను తిలకిస్తారని అధికారులు వెల్లడించారు.

Narendra Modi
Bangladesh
Haseena
Tour

More Telugu News