తీవ్ర గందరగోళం మధ్య నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Rajya Sabha passes the Government of National Capital Territory of Delhi Bill
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పించే బిల్లు
  • అరుపులు, వాకౌట్ల మధ్య పాస్ అయిన బిల్లు
  • బిల్లును వ్యతిరేకించిన వైసీపీ
విపక్షాల నిరసనలు, అరుపులు, వాకౌట్ల మధ్య నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

మరోవైపు ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు విపక్షాలు గట్టిగా ఎదిరించాయి. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని చెప్పారు. రాజ్యాంగానికి లోబడే బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీల్లో బీజేడీ, సమాజ్ వాదీ, టీఎంసీ తదితర పార్టీలతో పాటు వైసీపీ కూడా ఉంది.

పార్లమెంటు ఉభయసభలు బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో... దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. ఆయన సంతకం చేసిన తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది.
Go Back to Shorts
National Capital Territory of Delhi Bill
Rajya Sabha

More Telugu News