జగన్ గారూ.. వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.. మాట నిలబెట్టుకోండి: సోము వీర్రాజు

Somu Veerraju demands Jagan to regularise contract lecturers
  • కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు
  • వారి ఒప్పంద గడువు ముగుస్తోంది
  • ఒప్పందాన్ని పెంచడమే కాకుండా రెగ్యులరైజ్ చేయండి
ఒప్పంద ప్రాతిపదికన కాలేజీల్లో అధ్యాపకులుగా పని చేస్తున్న వారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులుగా పని చేసేందుకు 2000లో జీవో నెంబర్ 142, 143 విడుదల చేశారని లేఖలో తెలిపారు. జీవో నెంబర్ 199 ప్రకారం 2021 మార్చి 21 నాటికి వారి ఒప్పంద గడువు పూర్తవుతుందని చెప్పారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని మే వరకు పొడిగించారని... వచ్చే విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో వీరంతా జీతాలు లేకుండానే ఇంటర్మీడియట్ పేపర్లను దిద్దాల్సి ఉంటుందని చెప్పారు. వీరి పరిస్థితిని గమనించి వారి పని కాలాన్ని పొడిగించాలని కోరుతున్నామని అన్నారు.

కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల సమయంలో మీరు హామీ ఇచ్చారని.... ఆ హామీని ఇంత వరకు నెరవేర్చలేదని సోము వీర్రాజు గుర్తుచేశారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్న వీరికి లాక్ డౌన్ కాలం ఆర్థికంగా సమస్యలను సృష్టించిందని చెప్పారు. వీరిని మీరే ఆదుకోవాలని అన్నారు. వారి కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించడమే కాకుండా... త్వరలోనే వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. 
Go Back to Shorts
Somu Veerraju
Jagan
BJP
YSRCP
Contract Lecturers

More Telugu News