పోస్టుమార్టం చేయబోతుండగా బతికాడు... కర్ణాటకలో ఘటన!

Youth gets life on Post martem table in Karanataka
  • రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు
  • ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
  • చనిపోయాడంటూ వెంటిలేటర్ తొలగించిన వైద్యులు
  • పోస్టుమార్టం కోసం దేహం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
  • యువకుడి శరీరంలో కదలికలు గుర్తించిన బంధువులు
కర్ణాటకలో విస్మయం కలిగించే సంఘటన చోటుచేసుకుంది. చనిపోయాడనుకుని పోస్టుమార్టం చేయబోతుండగా ఓ యువకుడిలో కదలిక కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహాలింగపూర్ కు చెందిన 27 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్న దశలో అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. అయితే కొద్దిసేపటికే అతడు చనిపోయాడంటూ డాక్టర్లు ప్రకటించారు. దాంతో ఆ యువకుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇక, అతడి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం ప్రారంభించబోతుండగా ఆ యువకుడి దేహంలో కదలిక కనిపించింది. ఇది గమనించిన ఆ యువకుడి బంధువులు వైద్యులకు ఈ విషయం తెలిపారు. దాంతో అతడిని హుటాహుటీన మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నట్టు తెలిసింది.

దీనిపై ప్రభుత్వాసుపత్రి వర్గాలు స్పందిస్తూ, ఆ యువకుడికి మొదట చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు తప్పుడు నిర్ణయం వెలిబుచ్చారని, బతికున్నవాడికి వెంటిలేటర్ తీసేసి చనిపోయాడని చెప్పారని పేర్కొన్నారు.
Go Back to Shorts
Man
Road Accident
Private Hospital
Ventilator
Govt Hospital
Post Martem

More Telugu News