APSRTC: ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించిన ఏపీఎస్ ఆర్టీసీ!

APSRTC Discounts in Bus Tickets
  • కరోనా కారణంగా ఏపీ బస్సులపై తగ్గిన ఆదరణ
  • అన్ని సీట్లపైనా 10 శాతం రాయితీ
  • మిగతా బస్సుల్లో 10 శాతం సీట్లకు రాయితీ
  • మార్చి 31 వరకూ అమలు
ఆర్టీసీ బస్సులకు ఆదరణ తగ్గి, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పుంజుకున్న వేళ, ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. 'ఎర్లీ బర్డ్' పేరిట అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ లో భాగంగా ఏసీ బస్సుల్లోని అన్ని సీట్లలో, సూపర్ డీలక్స్, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులో 10 శాతం సీట్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఈ సర్వీసుల్లో కనీసం 48 గంటల ముందుగా టికెట్లను రిజర్వ్ చేయించుకుంటే, టికెట్ ధరపై 10 శాతం రాయితీ లభిస్తుంది. సూపర్ లగ్జరీ, అలక్ట్రా డీలక్స్ బస్సుల్లో నలుగురు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఐదుగురు రాయితీపై టికెట్ ను కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ వద్ద 348 ఏసీ బస్సులుండగా, వాటిల్లో 270 బస్సులు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. కరోనా కారణంగా ఏసీ బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు జంకుతున్న వేళ, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో, అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించి, ప్రయాణికులను ఆకర్షించేందుకు అన్ని టికెట్లపైనా రాయితీలు అందించాలని అధికారులు నిర్ణయించారు.

ఇక ఈ తగ్గింపు ధరలు మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటాయి. మొత్తం 3,078 నాన్ ఏసీ దూర ప్రాంత సర్వీసుల్లో పది శాతం సీట్లుగా 300కు పైగా సీట్లను తక్కువ ధరలకు అందిస్తామని, ఆక్యుపెన్సీ రేషియోను 70 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఉన్నతాధికారులు తెలిపారు.

More Telugu News

APSRTC
Bus Tickets
Offers