లీకులు ఆపండి.. ఆ మూడు చానెళ్లపై చర్యలు తీసుకోండి: ఢిల్లీ హైకోర్టులో దిశా రవి
- దర్యాప్తు సమాచారాన్ని పోలీసులు మీడియాకు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి
- తన వాట్సాప్ చాట్ లను లీక్ చేయకుండా చూడాలని వినతి
- మీడియా సంస్థలు కేబుల్ టీవీ నెట్ వర్క్ రూల్స్ పట్టించుకోలేదని వెల్లడి
- చాట్ ల ప్రసారం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని ఆరోపణ
అనుమతి లేకుండానే థర్డ్ పార్టీతో చేసిన ప్రైవేట్ చాటింగ్ వివరాలను ప్రసారం చేసినందుకు మూడు జాతీయ వార్తా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. ఆ సంస్థలు కేబుల్ టీవీ నెట్ వర్క్ రూల్స్ ను ఉల్లంఘించాయని ఆమె పేర్కొన్నారు. సమాచార ప్రసార శాఖ ఆయా చానెళ్లపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.
ఏ చానెల్ కూడా తన వాట్సాప్ ప్రైవేట్ చాట్ వివరాలను వెల్లడించకుండా చూడాలన్నారు. దర్యాప్తుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం అక్రమమని వ్యాజ్యంలో దిశ ఆరోపించారు. అది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం, పరువుకు భంగం కలిగించడమేనని ఆమె అన్నారు. ఢిల్లీ పోలీసుల చర్య రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించినట్టేనన్నారు.