Revanth Reddy: రైతుల కష్టాలు ఇలా ఉంటే నేను కారెక్కి ఇంటికి ఎట్లా పోతాను? ఇక్కడి నుంచే పాదయాత్ర చేస్తా: రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం

Revanth Reddy Padayatra to Hyderabad
  • అచ్చంపేటలో రేవంత్ రైతు భరోసా దీక్ష
  • పాదయాత్ర చేయాలన్న మల్లు రవి, సీతక్క
  • వెంటనే నిర్ణయాన్ని అమలు చేసిన రేవంత్
  • పాదయాత్రగా హైదరాబాద్ పయనం
  • కేంద్రంపై విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఆయన మనసు మార్చుకుని తన దీక్షను పాదయాత్రగా మార్చేశారు. అప్పటికప్పుడు అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్రగా బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయం మార్చుకోవడానికి కారణం కాంగ్రెస్ నేతలు మల్లు రవి, ధనసరి సీతక్క అని చెప్పాలి. వారి సూచనల మేరకు రేవంత్ పాదయాత్ర చేసేందుకు సంసిద్ధులయ్యారు.

అంతకుముందు అచ్చంపేటలో దీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను నల్లమల బిడ్డనని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే శక్తిని ఈ ప్రాంత ప్రజలు ఇచ్చారని ఉద్ఘాటించారు. రైతు కోట్లు సంపాదించేందుకు వ్యవసాయం చేయడని, బీరువాల్లో బంగారం నింపేందుకు వ్యవసాయం చేయడని, కేవలం ఆత్మగౌరవం కోసమే రైతు వ్యవసాయం చేస్తాడని స్పష్టం చేశారు.

"కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులకు మార్కెట్ యార్డులు లేవు, మద్దతు ధరలు లేవు, రైతు జీవితాలు అదానీ, అంబానీల పరం కాబోతున్నాయి. రైతుల కష్టాలు ఇలా ఉంటే నేను కారెక్కి ఇంటికి ఎలా పోగలను? అందుకే ఇక్కడి నుంచే పాదయాత్ర చేస్తాను" అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Revanth Reddy
Padayatra
Hyderabad
Atchampet
Congress

More Telugu News