నీతీ ఆయోగ్ సూచనల మేరకే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

  • అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశం
  • నష్టాల్లో ఉన్నందునే స్టీల్ ప్లాంట్ ను విక్రయిస్తున్నామని వెల్లడి
  • ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను విక్రయించబోమని స్పష్టీకరణ
  • కేంద్ర బడ్జెట్ ను జాతీయ దృక్పథంతో చూడాలని హితవు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. నీతీ ఆయోగ్ సిఫారసుల మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతీ ఆయోగ్ పేర్కొందని, ఆ ప్రకారమే తాము ముందుకు వెళతామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తమకు లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

ఇక, బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులపైనా ఆయన మాట్లాడారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగలేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ను జాతీయ దృక్పథంతో చూడాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు గురించి చెబుతూ, ఇటీవల కాలంలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన పోలవరం నిధులపై తమను మూడుసార్లు కలిశారని, ఒప్పందం ప్రకారమే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నామని అనురాగ్ ఠాకూర్ వివరించారు.

Anurag Thakur
Vizag Steel Plant
Andhra Pradesh
Centre
NITI Aayog

More Telugu News