హైదరాబాద్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువతుల అదృశ్యం!

Three Ladies Missing in Hyderabad
  • లాలాగూడ పరిధిలో కనిపించకుండా పోయిన కీర్తి ప్రజ్ఞ 
  • నిన్న తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయిన డిగ్రీ యువతి రోహిణి
  • ఇంట్లో ఉండటం ఇష్టం లేదని లేఖ రాసి మంజుల అదృశ్యం
  • కేసులు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్ లో ఒకే రోజు ముగ్గురు యువతులు అదృశ్యం కావడం కలకలం రేపింది. లాలాగూడ, బౌద్ధనగర్, తిరుమలగిరి పరిధుల్లో ఈ ఘటనలు జరుగగా, పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, లాలాగూడ పీఎస్ పరిధిలోని అడ్డగుట్టలో శ్రీధర్ అనే వ్యక్తి కుమార్తె కీర్తి ప్రజ్ఞ (20) 4వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం గాలించిన శ్రీధర్, అతని మిత్రులు, చివరకు పోలీసులను ఆశ్రయించారు.

మరో ఘటనలో అమీర్ పేటలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్న శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన బండారి రోహిణి (19) గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రోహిణి తండ్రి జగదీశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవికుమార్ కేసు రిజిస్టర్ చేసి, విచారణ ప్రారంభించారు. ఆమె ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు.

ఇదే సమయంలో తిరుమలగిరి పరిధిలోని సాయిబాబా హాట్స్ కు చెందిన మంజుల (20) ఓ స్కూల్ లో రిసెప్షనిస్ట్ గా పని చేస్తోంది. రోజు మాదిరిగానే నిన్న స్కూల్ కు వెళ్లిన ఆమె, తనకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదని లెటర్ రాసి, తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని స్కూల్ సహోద్యోగులకు చెప్పి వెళ్లిపోయింది. మంజుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటన పైనా కేసు నమోదు చేశారు పోలీసులు.
Go Back to Shorts
Hyderabad
Police
Missing
Ladies

More Telugu News