నామినేషన్లు వేయడానికి వెళుతున్న బీజేపీ, జనసేన మద్దతుదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు: సోము వీర్రాజు

  • పోలీసులపై ధ్వజమెత్తిన సోము వీర్రాజు
  • కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఉత్సాహపడుతున్నారని వ్యాఖ్య 
  • పోలీసులకే కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచన
  • తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ
ఏపీ పోలీసులపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వెళుతున్న బీజేపీ, జనసేన మద్దతుదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఉన్నత విద్యావంతులైన యువత నామినేషన్లు వేయడానికి వస్తే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసు విభాగం చాలా ఉత్సాహపడుతోందని అన్నారు. ఎవరైనా నామినేషన్ వేస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ, దిశ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఎన్నికల కమిషన్ కౌన్సిలింగ్ ఇవ్వాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.

తమవారికి చెందిన వ్యాపార స్థలాల్లో మద్యం సీసాలు దొరికాయంటూ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అదేమని పోలీసులను ప్రశ్నిస్తే,  మీ వాళ్లు దొరికిపోయారు, అందుకే రిమాండ్ కు పంపించేశాం, అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు మద్యం అమ్ముకుంటూ దొరికిపోయారంటున్నారని, ఇది ఎంత ఆశ్చర్యకరం అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.


More Telugu News

Somu Veerraju Police Andhra Pradesh BJP Janasena Gram Panchayat Elections