మీపై అరెస్ట్ వారెంట్ ఎవరు జారీ చేస్తారు?: కర్ణాటక సీఎం యడియూరప్పకు సుప్రీంకోర్టు ప్రశ్న

  • 2011 నాటి కేసులో హైకోర్టు విచారణ
  • అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని యడియూరప్ప పిటిషన్
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే
2011లో ఓ ప్రైవేటు ఇన్వెస్టర్ కు ఇచ్చిన 26 ఎకరాల భూమిని తిరిగి వెనక్కు తీసుకోవడంపై నాటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీదట ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో యడియూరప్ప తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.

కేసులో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, "మీరు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి. మీపై అరెస్ట్ వారెంట్ ను ఎవరు జారీ చేయగలరు? మహా అయితే ఓ రిక్వెస్ట్ ను మాత్రం మీ ముందు ఉంచగలరంతే" అంటూనే అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో కర్ణాటక హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేందుకు మాత్రం అత్యున్నత ధర్మాసనం అంగీకరించలేదు.

ఈ కేసులో యడియూరప్పపై ఫోర్జరీ అభియోగాలు కూడా నమోదై ఉన్నాయి. ఆయనతో పాటు మాజీ ముఖ్య కార్యదర్శి వీపీ బాలిగర్, కర్ణాటక ఉద్యోగ్ మిత్ర మాజీ ఎండీ మిత్రా శివస్వామిలపైనా కేసులు నమోదయ్యాయి.

Supreme Court
Yadyurappa
Karnataka
SA Bobde

More Telugu News