రామతీర్థం వద్ద హైటెన్షన్.. విజయసాయిరెడ్డిని అడ్డుకున్న టీడీపీ, బీజేపీ!

BJP and TDP stopped Vijayasai Reddy at Ram Theertha
  • కొండపైకి వెళ్లే అర్హత విజయసాయికి లేదని బీజేపీ, టీడీపీ శ్రేణుల నినాదాలు
  • పోలీసుల అండతో కొండపైకి వెళ్లిన విజయసాయి
  • జైశ్రీరాం నినాదాలతో మారుమోగుతున్న బోడికొండ ప్రాంతం
విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పటికే 100కు పైగా ఇలాంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విపక్షాలు మండిపడుతుండగా... ఇది టీడీపీ పనే అని వైసీపీ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో, ఘటనా స్థలిని పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థంకు బయల్దేరారు. కాసేపట్లో ఆయన అక్కడకు చేరుకోబోతున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి అంతకు ముందే బోడికొండకు చేరుకుని, రామతీర్థంకు చేరుకున్నారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

బోడికొండ కింద ఇప్పటికే టీడీపీ, బీజేపీ, వైసీపీ శ్రేణులు టెంట్లు వేసుకున్నాయి. బీజేపీ శ్రేణుల్లో సాధువులు కూడా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అక్కడే ఉన్నారు. మరోవైపు రామతీర్థంకు వెళ్తున్న విజయసాయిని బీజేపీ, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కొండపైకి వెళ్లే అర్హత విజయసాయికి లేదని వారు మండిపడ్డారు. గోబ్యాక్ విజయసాయిరెడ్డీ అంటూ నినదించారు. జైశ్రీరాం నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అయితే, పోలీసుల అండతో విజయసాయిరెడ్డి కొండపైకి బయల్దేరారు. కాసేపట్లో చంద్రబాబు అక్కడకు చేరుకోనున్నారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించారు.
Go Back to Shorts
Rama Theertha
Telugudesam
BJP
YSRCP
Chandrababu
Vijayasai Reddy

More Telugu News