బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘన విజయం!
- 8 వికెట్ల తేడాతో విజయం
- రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులకు పరిమితమైన ఆసీస్
- 70 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఇండియా
తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు, ఆపై రెండో ఇన్నింగ్స్ లో ఆరంభంలో తడబడినా విజయం సాధించారు. ఈ ఉదయం 70 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో మయాంక్ అగర్వాల్ 5 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ కు చేరగా, ఆపై వన్ డౌన్ లో వచ్చిన ఛటేశ్వర్ పుజారా కూడా నిరాశపరుస్తూ 3 పరుగులు మాత్రమే చేశాడు.
మరో ఓపెనర్ శుభమన్ గిల్ 36 బంతుల్లో 35, అజింక్య రహానే 40 బంతుల్లో 27 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ లకు చెరో వికెట్ లభించింది. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ సాధించిన కెప్టెన్ అజింక్య రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.