కేసీఆర్ కంటే అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డే బెటర్: అరవింద్

  • పీవీపై కేసీఆర్ దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు
  • పీవీ ఘాట్ ను కూలగొడతామని ఓ ఎమ్మెల్యే అంటే కనీసం స్పందించలేదు
  • భారతీయత అంటే ఏమిటో పీవీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి మండిపడ్డారు. దివంగత పీవీ నరసింహారావుపై కేసీఆర్ దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. పీవీ ఘాట్ ను కూలగొడతామని ఓల్డ్ సిటీకి చెందిన ఒక ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేస్తే... కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటే ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నయమని అన్నారు. కనీసం ఒకరిని కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టించారని చెప్పారు. ఎంఐఎంను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎక్కడ చెప్పాలో అక్కడే చెబుతామని తెలిపారు. భారతీయత అంటే ఏమిటో పీవీ నరసింహారావును చూసి కేసీఆర్ నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. పీవీ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. పీవీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనను రాజకీయాల్లోకి రావొద్దని పీవీ ఒకసారి సూచించారని అరవింద్ అన్నారు. ఈ రోజు పీవీ ఘాట్ లో అరవింద్ నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

Dharmapuri Arvind
BJP
KCR
TRS
PV Narasimha Rao

More Telugu News