త్వరలోనే కేసీఆర్ జైలుకు పోతారు: బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోతలరాయుడైన కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని తాము ముందే చెప్పామని అన్నారు. ఢిల్లీలో వంగివంగి దండాలు పెట్టినా తాము క్షమించే ప్రసక్తే లేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను నగర ప్రజలు చావు దెబ్బ కొట్టారని సంజయ్ అన్నారు. ఈ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. కేసీఆర్ బయటకు చెప్పేది ఒకటని... కానీ, లోపల జరిగేది మరొకటని అన్నారు. హైదరాబాదును వరదలు ముంచెత్తుతుంటే ఫాంహౌస్ వదిలిపెట్టి కేసీఆర్ బయటకు కూడా రాలేదని విమర్శించారు.

 కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే... మా రాష్ట్రం, మా నిధులు అంటారని... రాష్ట్రమేమైనా మీ అయ్య జాగీరా? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.


More Telugu News