చివరిరోజు ఆటలో ఆసీస్ ఆటగాళ్ల సెంచరీలు... డ్రాగా ముగిసిన టీమిండియా ప్రాక్టీసు మ్యాచ్

Team India and Australia A practice match ended as draw
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య సిడ్నీలో జరిగిన మూడ్రోజుల ప్రాక్టీసు మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో ఆసీస్ ఆటగాళ్లు సెంచరీలతో రాణించారు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా-ఏ మూడో రోజు ఆట ఆఖరికి రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. బెన్ మెక్ డెర్మట్ 107, జాక్ విల్డర్ ముత్ 111 పరుగులతో అజేయంగా నిలిచారు.

25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా-ఏ జట్టును మెక్ డెర్మట్, కెప్టెన్ అలెక్స్ కేరీ (58) ఆదుకున్నారు. కేరీ అవుటైనా.... బెన్ మెక్ డెర్మట్, విల్డర్ ముత్ జోడీ మరో వికెట్ పడకుండా ఆట ముగించింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించేందుకు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమి 2, సిరాజ్, విహారి చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా-ఏ 108 పరుగులకే కుప్పకూలింది. ఆపై భారత్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 386 పరుగులు చేసింది. ఇక, భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు డిసెంబరు 17న ప్రారంభం కానుంది. అడిలైడ్ లో జరిగే ఈ మ్యాచ్ డే/నైట్ విధానంలో పింక్ బాల్ తో ఆడనున్నారు.
Go Back to Shorts
Team India
Australia-A
Practice Match
Draw
Sydney

More Telugu News