Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన భూగర్భ జలాలు!

  • నగరంలో ఇటీవల విస్తారంగా వానలు
  • చెరువులు నిండడంతో పెరిగిన భూగర్భ జలాలు
  • రెండు మీటర్ల నుంచి ఎనిమిదిన్నర మీటర్ల వరకు పెరిగిన వైనం
ground water levels in Hyderabad raised

నీటి కోసం అల్లాడిపోయే సగటు నగర జీవికి ఇది శుభవార్తే. హైదరాబాద్‌లో ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. నవంబరు నాటికి సాధారణ వర్షపాతం కంటే చాలా ప్రాంతాల్లో 70 నుంచి 80 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు రెండు మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయి. అమీర్‌పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో భూగగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, రంగారెడ్డి జిల్లాలో ఎనిమిదిన్నర మీటర్ల వరకు జలాలు పైకి ఉబికి వచ్చాయి.

అక్టోబరు నెలలో కురిసిన వానలకు శివార్లలో దాదాపు అన్ని చెరువుల్లోనూ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. చెరువులన్నీ నిండడంతో శివార్లలో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. రాజేంద్రనగ్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితోపాటు పలు ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరిగాయి.

ప్రతి వేసవిలోను నీటి ఎద్దడి తలెత్తుతుండడంతో నగర వాసులు చాలామంది ఇంకుడు గుంతల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విస్తారంగా వానలు కురవడంతో నీరు భూమిలో ఇంకేందుకు ఇవి ఎంతగానో దోహదపడ్డాయని చెబుతున్నారు.

More Telugu News